విశాఖలో కియాఎక్స్‌పోర్ట్ సెంటర్, శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్.. కొరియాలో లోకేశ్ కీలక భేటీలు

  • దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్
  • శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు చేయాలని సునిక్ సిస్టమ్స్‌కు విజ్ఞప్తి
  • ఏపీలో ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కియాకు ప్రతిపాదన
  • కొరియా ఉపమంత్రితో భేటీ.. ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటుకు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఐదో రోజు (గురువారం) ఆయన పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు.

సియోల్‌లో కియా మోటార్స్ గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హన్ లీ, ఇతర ఉన్నతాధికారులతో లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరారు. ప్రపంచ మార్కెట్ల కోసం విశాఖపట్నం పోర్టు సమీపంలో ఒక సీకేడీ అసెంబ్లింగ్, ఎక్స్‌పోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు, సెమీకండక్టర్స్, ఓఎల్ఈడీ డిస్‌ప్లే పరికరాల తయారీ సంస్థ సునిక్ సిస్టమ్ సీఈవో ఎస్.డబ్ల్యూ. చుంగ్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో డిస్‌ప్లే పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇందుకు ముందుకొస్తే జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

తన పర్యటనలో భాగంగా లోకేశ్.. దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగశాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌తోనూ భేటీ అయ్యారు. ఏపీలో అమలు చేస్తున్న 3S (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని వివరించారు. ఏపీ-కొరియా ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్, కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో కోరారు.

Nara Lokesh
Kia Motors Andhra Pradesh
Sunic System Sri City
South Korea investment AP
Visakhapatnam Kia Export Center
Andhra Pradesh IT Minister

More Telugu News